పాలకులే చదువురాని అవివేకులైతే..??

Submitted by Praneeth Kumar on Sat, 06/01/2024 - 09:40
If the rulers are uneducated fools..??

పాలకులే చదువురాని అవివేకులైతే..!!

ఖమ్మం, జనవరి 06, ప్రజాజ్యోతి.         

'పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం, పూజ గది నుండి వచ్చేవారు బహుశా పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో'. పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ ఇలా రాసుకొన్నారు. పుస్తక ప్రేమికులకు, అధ్యయన శీలురకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తి నిస్తాయి. చదివిన పుస్తకంలోని తత్తాన్ని బయటకు తీసి. అవసరం లేని భాగాన్ని వదిలేయాలి. ‘జ్ఞానం అనేది శక్తి, ఆనంద సాధనం’ ఇది అక్షర సత్యం. పుస్తకం చదవడం మొదలు పెట్టగానే అనంతమైన సుఖానుభవం కలగాలి. చదవడంలో కలిగే ఆనందం వర్ణింపనలవి కానిది. బాధ కలిగించే విషయమేమంటే చాలా మంది మనవాళ్ళు చదవరు. అధ్యయనం లేకుండా జ్ఞానం, జ్ఞానం లేకుండా శక్తీ రావు. ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా వుండాలి.
ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి, పుస్తకాలు దీపాల వంటివి. అవి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి. విద్య వికాసాలు పొందాలి, ఇతరులకు అందించాలి. అంతర్గతంగా ఆందోళన పడాలి, మార్పు కోసం ఆందోళన చేయాలి. సంఘటిత పడాలి, సమైక్యంగా ముందుకు సాగాలి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్ళను సృష్టిస్తే, గ్రంథాలయం దేశాన్ని మార్చే మహా వీరుల్ని సృష్టిస్తుంది. మానవీయ విలువల దృష్టి కోణంతో అంబేడ్కర్ కృషిని బేరీజు వేస్తే అది ఇలా వుంటుంది. ‘ఇన్సానోంకో గులాం బనాకర్/ హజారోఁ బాదుషా బనేహై/లేకిన్ గులామోంకొ ఇన్‌సాన్ బనాకర్/సిర్ఫ్ ఏక్ హి బాద్‌షా బనే హై ఓ హై డా.బీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్'. అంటే అర్థం మనుషుల్ని బానిసలుగా చేసి, వేల మంది చక్రవర్తులయ్యారు. కాని, బానిసల్ని మనుషులుగా చేసిన చక్రవర్తి ఒకే ఒక్కడు ఆయనే డా.భీమ్ రావ్ రామ్‌జీ అంబేడ్కర్. ఆయన విద్యార్హతలు కూడా ఒకసారి గమనిద్దాం. ఫాసిస్టులకు అంబేడ్కర్ అంటే పడదు, కాలాలకు అతీతంగా అత్యున్నతమైన విద్యనార్జించిన ఆర్థిక వేత్త అయ్యాడని ఉడుకుమోతుతనం. ఆయన విద్యార్హతలు ఏ కాలంలోనైనా ఆశ్చర్యం కలిగించేవే. 1917 పిహెచ్.డి.కొలంబియా యూనివర్శిటి. 1921 ఎంఎస్‌సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. 1922, 30 సెప్టెంబర్, బారిస్టర్ ఎట్ లా గ్రేట్ బ్రిటన్, లండన్. 1923 నవంబర్ డి.ఎస్‌సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. 1952 గౌరవ డాక్టరేట్ ఎల్.ఎల్.డి కొలంబియా యూనివర్శిటి. 1953, 12 జనవరి డి.లిట్ గౌరవ డాక్టరేట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్. రెండు మాస్టర్స్ డిగ్రీలు, నాలుగు డాక్టరేట్లు ఇన్ని డిగ్రీలు ఇంత జ్ఞాన సంపదను సంపాదించిన భారతీయుడిగా గుర్తించి, న్యూయార్క్ కొలంబియా యూనివర్శిటిలో ఆయన విగ్రహం ప్రతిష్టించారు. అదీ ఎందుకూ..?? జ్ఞాన సంకేతంగా ‘సింబల్ ఆఫ్ నాలెడ్జ్’గా గౌరవించారు.
చదువుకు, విజ్ఞతకు, సమాజోద్ధరణకు అవినాభావ సంబంధం వుంది. ప్రస్తుతం అధికారంలో వుండి, మన దేశాన్ని ఫాసిస్టు ధోరణిలోకి నెట్టేస్తున్న వారి విద్యార్హతలేమిటి..?? వారి వివేకం ఎక్కడ..?? మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణకాండలు సృష్టించడమే పనిగా పెట్టుకొన్న వీరు, చరిత్ర హీనులుగా మిగలరా..?? ఆరో తరగతిలో బడి నుండి పారిపోయిన వాడిని వెతుక్కొచ్చి రాజ్యాధికారం కట్టబెడితే ఏమవుతుంది..?? పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. బ్రిటీష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన ఈ మాట ఎంత గొప్పగా వుందో ఆలోచించండి 'చదువు మనిషిని పూర్తిగా మానవుడిగా తీర్చిదిద్దుతుంది, చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చి దిద్దుతుంది, రాత ఖచ్చితమైన మానవుడిగా తీర్చి దిద్దుతుంది'. చదువుకొన్న వివేకవంతులకే సోషలిజం విలువ తెలుస్తుంది. చదువు, సంస్కారం, మానవీయ విలువల పై గౌరవ భావం లేని పాలకులు కేవలం జంగిల్ రాజ్యం స్థిరపరిచి, ఆటవిక పాలనను అందించగలరు. ప్రజల బతుకులు అభద్రతలోకి తోసేయగలరు.
సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుందని, ప్రజలందరికి అవసరమైన ఆహారం, గృహ వసతి అందిస్తుందని, మానవుల మధ్య వర్గ విభజనలు తొలగిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రజాతంత్రయుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుందని, ప్రపంచ శాంతి సమైక్యతల్ని నెలకొల్పుతుందని ప్రసిద్ధ సామాజిక ఆర్థిక వేత్తలంతా చెపుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ ఊరికే రావని క్రమంగా పెట్టుబడిదారి వ్యవస్థను కూకటి వ్రేళ్ళతో పెకిలించి పారేయాలని కూడా చెప్పారు. కాని నేటి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు..?? ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్ల దగ్గర పాలేర్లలా పడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని గమనించి కాబోలు ఓ మాట అన్నారు పెద్దలు 'అధ్యయనం లేకుండా ఒక పరిష్కారం కనుగొనాలనుకునే వారు లేక ఒక ఆలోచనకు రావాలనుకొనేవారు కేవలం తెలివి తక్కువ దద్దమ్మలు మినహా మరేమీ కాదు'. ఇలా చేస్తే సరైన పరిష్కారం లభించడం కాని, మంచి ఆలోచనకు రావడం గాని జరగదన్న విషయం తెలుసుకోవాలి.
తమ మూర్ఖపు ప్రకటనలతో జనాన్ని వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న నేటి మన ఆలోచన లేని పాలకులకు అధ్యయనం ఆలోచన వంటి మాటలకు అర్థాలు తెలుస్తాయా..?? అదేమిటో మన దేశంలోనే చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. పదో తరగతిలో ఫెయిల్ అయిన క్రికెటర్ సచిన్ ‘భారత రత్న’ అయ్యాడు. పెట్రోల్ బంక్‌లో పని చేసిన అంబాని కోట్ల కోట్లకు అధిపతి అయ్యాడు. రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్ముకున్నానన్న వాడు దేశానికి ప్రధాని అయ్యాడు. కానీ, చూడండి క్లాసులోకి రానివ్వకపోతే క్లాసు బయటే కూర్చుని చదువుకున్న దళిత బాలకుడు భీమ్‌రావ్ అంబేడ్కర్, ఈ దేశపు శిల్పి అయ్యాడని అంటే ఒప్పుకోరు ఎందుకు..?? దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చి, దేశానికో అందమైన ఆకృతినిచ్చాడంటే పట్టించుకోరెందుకు..?? ప్రపంచంలోనే జ్ఞానానికి ప్రతీక అయ్యాడని గర్వంగా చెప్పుకోరెందుకు..?? న్యూయార్క్‌‌ కొలంబియా విశ్వ విద్యాలయంలోనే ఆయన స్మృతి చిహ్నం జ్ఞాన ప్రతీకగా ఉంది కదా..!!
దేశాన్ని హిందూ దేశంగా మార్చడం కాదు గాని, వారి పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక చిన్న ఊరిని పూర్తి హిందూ గ్రామంగా మార్చి చూపించమనండి చూద్దాం. చంద్రుడి మీద నీరు లేదని అంటే ఏం చేస్తారు..?? భూమి మీది నుంచి అక్కడికి గోమూత్రం తీసుకుపోతారా..?? ఒకాయన చంద్రుణ్ణి ‘హిందూదేశ్’ గా ప్రకటించాలన్నాడు. మరో ఆ ఫలానా పార్టీ ఎంపి అయితే మతి భ్రమించినట్టు మాట్లాడాడు. చంద్రుణ్ణి భారత్ జయించిందని మళ్ళీ ఆ ఫలానా పార్టీనే అధికారంలోకి తీసుకొస్తే తాము చంద్రుడి మీద ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పంచి పెడతామని ప్రకటించాడు. కోతలు కోయడమే ఆ ఫలానా పార్టీ పాలసీ అయినప్పుడు ఇక దానికి హద్దులెందుకు..?? అని అనుకొని ఉంటారు. ఒకడు మనుషులను పశువుల కంటే హీనంగా చూస్తాడు, విద్వేషాలు రెచ్చగొడతాడు. తన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మారుస్తాడు. మరొకడు ఆవు మూత్రం సీసాల్లో నింపి, అందంగా ప్యాక్ చేసి, లీటర్ రూ.120/- నుండి రూ.1040/- వరకు అమ్ముకుంటాడు. వాడో నకిలీ మెల్లకన్ను బాబా. ఇలాంటి వారంతా దేశంలో గొప్ప తాత్తికవేత్తలంట. వీళ్ళ గూర్చి విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు పాఠాలు చదువుకోవాలంట.
దేశం ఎటుపోతున్నది..?? ఎవరు రక్షిస్తారీ దేశాన్ని..?? దేశ ప్రజలు ఆలోచించరా..?? మేలుకోరా..?? కర్తవ్యోన్ముఖులు కారా..?? 2015 లో ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో స్వయంగా లాల్‌కృష్ణ అద్వాని ఇలా చెప్పారు. 'నలభై యేళ్ళ క్రితం ఇందిరా గాంధీ పరిపాలనలో విధించిన ఎమెర్జన్సీ వదిలేయండి. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే. ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎమెర్జెన్సీలోనే వుంది. ఏళ్ళకేళ్ళు గడిచినా అనధికార అప్రకటిత ఎమెర్జెన్సీ నడుస్తోంది..!!'
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద అక్కసుతో నెహ్రూ జన్మస్థలమైన అలహాబాద్ పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ అన్నారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.ఎం మ్యూజియం అన్నారు. అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే. ఇతర ప్రధానుల జ్ఞాపక చిహ్నాలేవీ లేవు. ఈ పేర్లు మార్చే రోగం ఈ ప్రభుత్వాలకి ఎందుకు పట్టిందో తెలియదు. వీరు పెట్టిన పేర్లు చిరకాలం వుంటాయా..?? వీరు అధికారంలోంచి దిగిపోగానే, వీరు పెట్టిన పేర్లు కూడా ‘హుష్‌కాకి’ అయిపోవా..??
సమకాలీన రాజకీయ పరిస్థితులు చూసి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా వ్యాఖ్యానించారు
'మోడీ కాకపోతే ఇంకెవరూ..?? అని అడుగుతారు. అయిదేళ్ళలో ఆయన ఏం చేశారో చూడండి. ఐదు కోట్ల ఉద్యోగాలు గాలికెగిరిపోయాయి. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్‌పాల్, సిబిఐ, ఎన్‌ఐఎ, మీడియా అన్నింటిని వశపరుచుకొన్నారు. మూక దాడులు, ద్వేష పూరిత అబద్ధపు ప్రకటనలు ప్రధాన వార్తా స్రవంతిలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. వీరికే గనక ఈ దేశ ప్రజలు మరోసారి అవకాశమిస్తే ఇక అంతే నాగరికత అంతరించినట్టే. 'మనమెంత ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నామన్నది ఇలాంటి వివేకవంతుల మాటల్లోంచి గ్రహించుకోవాలి. అందుకే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ తన మద్దతు కూడా తెలిపారు. 'మాకు సాధ్యమైనంత వరకు మేం, భారత రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, మాకు ప్రజల అండదండలు కూడా చాలా అవసరం. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి. వారి హక్కుల కోసం వారు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ప్రజల హక్కులు హరిస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. అయినా ప్రజలు తగ్గకూడదు, భయపడకూడదు. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రభుత్వాన్ని వివరణలు అడగాలి. లెక్కలు తేల్చమనాలి. ప్రభుత్వాలెప్పుడూ ప్రజలకు జవాబుదారీగా వుండాల్సిందే. ధైర్యంగా ఉండండి, న్యాయస్థానాలు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాయన్నారు'.