అక్కడ ఒడారు... ఇక్కడ గెలుస్తారా...?
ఒడిన ఎంపి అభ్యర్థులు
పార్టీ నేతలు, సామాజిక వర్గాలపైనే ఆశలు
నేతలను కలుపుకు పోయేందుకు తంటాలు
అసేంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితం
(నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో, ప్రజాజ్యోతి, ఎడ్ల సంజీవ్)
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో సమీకరణలు మొదలు అయ్యాయి. బిజెపి, కాంగ్రెస్, బిఅర్ఎస్ పార్టీలు ఎవరికి వారే పావులు కదుపుతూ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఏ పార్టీకి ఏ పార్టీ బి గ్రూపు అవుతుందో కానీ ఇప్పుడైతే ఎవరికి వారే చక్రం తిప్పుతున్నారు. ముగ్గురికి ముగ్గురు ప్రచారంలో దూకుడు పెంచారు. జగిత్యాలకు చెందిన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీశ్రేణులను కలుపుకునే ప్రయత్నం చేస్తుండగా, బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ నియోజక వర్గాల వారికి పట్టు పెంచుకొని పావులు కదుపుతున్నారు. ఇక బిఅర్ఎస్ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ సైతం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఒడిపోయిన వారిని సమీకరించి, పార్టీలోని కీలక నేతలను ఏకంగా చేస్తు పక్క ప్రణాళికతో చక్రం తిప్పుతున్నారు. ఇలా ముగ్గురు ఎంపి అభ్యర్థులు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా అచితూచి అడుగులు వేస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా 2023 శాసన సభ ఎన్నికల్లో ఒటమిని చావి చూసిన వారే కావడం విశేషం. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లో ఒటమి పాలయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం పోటీ పడటం రసవత్తరంగా మారింది.
అభ్యర్థులు ఒడారు ఇలా...
నిజామాబాద్కు చెందిన ఎంపి అరవింద్ కోరుట్ల నుంచి శాసన సభకు పోటీ చేసారు. నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పోటీ చేసారు. ఈ ముగ్గురి బలబలాలు శాసన సభ ఎన్నికల్లో ఇలా ఉన్నాయి.
కోరుట్లలో పోటీ చేసిన ధర్మపురి అరవింద్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. బిఅర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్కు 72,115(39.28) ఓట్లు రాగా ధర్మపురి అరవింద్కు 61,810 (33.67) ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్కు 39,647(21.6) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంపి అరవింద్ 10,305 ఓట్ల తేడాతో ఒడిపోయారు.
నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 21,963 ఓట్ల తేడాతో ఒడిపోయారు. కాంగ్రెస్కు 78,378 (40.19) ఓట్లు రాగా బాజిరెడ్డి గోవర్ధన్కు 56,415 (28.93) ఓట్లు వచ్చాయి. కాగా బిజెపికి 49,723 (25.5) వచ్చాయి.
జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయి 15,822 ఓట్ల తేడాతో ఒటమి పాలయ్యారు. కాంగ్రెస్కు 54,421 (30.86), గెలిచిన బిఅర్ఎస్ అభ్యర్థి సంజయ్కు 70,243 (39.83) ఓట్లు వచ్చాయి. బిజెపి మూడో స్థానంలో ఉన్న బిజెపికి 42,138 (23.89) ఓట్లు మాత్రమే రావడం విశేషం.
ఇలా ముగ్గురు అభ్యర్థులు అయా అసేంబ్లీ నియోజక వర్గాలలో రెండో స్థానానికి పరిమితం కావడం విశేషం. ఇద్దరు సీనియర్ లీడర్లుగా పేరున్నప్పటికి ఒకటి, రెండుసార్లు ఒడిన తిరిగి తమ సత్తా నిరూపించకున్న వారే ఉన్నారు. మొదటిసారి అసేంబ్లీకి పోటీ చేసిన అరవింద్ ఒటమిని చావిచూసారు. ఒటమి చెందిన అనుభవంతో ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో నెగ్గుకు రావడం శయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.
సామాజిక వర్గం కలిసి వచ్చేనా...?
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బిసి సామాజిక వర్గం సంఖ్య కీలక స్థాయిలోనే ఉంటుంది. బిజెపి సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్ మున్నూర్కాపు సామాజిక వర్గం కావడంతో బిఅర్ఎస్ ఇదే కోవలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేగా, మాస్ లీడర్గా పేరున్న బాజిరెడ్డి గోవర్ధన్ను తెరపైకి తెచ్చింది. దీంతో ఈ సామాజిక వర్గంలోని ఓటర్లు ఏటువైపునకు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి తోడు అయా పార్టీల బలబలాలు సైతం కీలకంగా పని చేయాల్సి అవసరం ఉందనే చర్చ కూడా ఉంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జీవన్రెడ్డికి అన్ని విధాలుగా అ సామాజిక వరం మద్దతును కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. జగిత్యాల నుంచి బోధన్ వరకు ఏడు నియోజక వర్గాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం కూడా కలిసి వచ్చే ఆంశంగా చెబుతున్నారు. జీవన్రెడ్డి, సునీల్రెడ్డి, వినయ్రెడ్డి, భూపతిరెడ్డి, సుదర్శన్రెడ్డిలు కీలకంగా మారారు. అయితే కాంగ్రెస్లో నాయకులు ఏ మేరకు కలిసి వస్తారనేది వేచి చూడాలి మరి.
వాళ్లే బలం...
ప్రస్తుతం ఎంపిగా బరిలో ఉన్న వారు అయా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను నమ్ముకొని పని చేసుఎ్తన్నారు. మరోవైపు పార్టీ కీలక నేతలతో ప్రచారం చేయించిన గట్టేక్కెందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏడు అసేంబ్లీ స్థానాల్లో బిఅర్ఎస్కు మూడు, బిజెపికి రెండు కాంగ్రెస్కు రెండు స్థానాలు ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకోని చక్రం తిప్పుతున్నారు. అలాగే పార్టీ ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలను ఏకం చేసి పని చేసే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్లోకి వలసలు పెరగడంతో పాటు బిజెపి, బిఅర్ఎస్లకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. గ్రామీణ స్థాయి, మండల స్థాయి నాయకులకు కాపాడుకోవడమే కాకుండా పార్టీ నుంచి చేయి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. చివరకు ఏమౌతుందో కానీ ఇప్పుడైతే జోరుగా ఊషారుగా ప్రచారం చేస్తున్నారు.
- 3 views