ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి),,,//// సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భోజనం వసతి సౌకర్యాలలో సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం జిల్లా లో పోడు భూములు, దళిత బంధు, ఆసరా పింఛన్ లపై సమీక్షించనున్న సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న వసతి గృహాలలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దళిత బంధు లబ్ధిదారుల యూనిట్ లను త్వరితగతిన గ్రౌండింగ్ చేసి, వారి ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలని అన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన 78,405 ఆసరా పింఛన్ ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు షేక్ రిజ్వాన్ భాషా, నటరాజ్, ఆర్డిఓ రాథోడ్ రమేష్, జెడ్పి సీఈవో గణపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, సునీత కుమారి, కృష్ణవేణి, దిలీప్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- 4 views